
విజయ్ ప్రమాణ స్వీకారం.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు సి. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ చారిత్రాత్మక వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రమాణ స్వీకారానికి ముందు త్రిష తన నివాసం నుంచి స్టేడియానికి బయలుదేరారు. ఈ సందర్భంగా విలేకరులు ఈ సందర్భం ప్రాముఖ్యత గురించి అడగగా, "ధన్యవాదాలు, ఈ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని సమాధానమిచ్చారు. త్రిష నీలం రంగు పట్టుచీర, క్రీమ్ బ్లౌజ్, వజ్రాల నెక్లెస్తో ఆమె మెరిసిపోయారు. సింపుల్ మేకప్తో ఆకట్టుకున్న ఆమె, ఉదయమే వేదిక వద్దకు చేరుకుని అభిమానులకు అభివాదం చేశారు. తన సహజ సిద్ధమైన అందంతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు.
కుమారుడి విజయంపై విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేయగా, తల్లి శోభ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా ఈ వేడుక 'మదర్స్ డే' రోజే జరగడం తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు. 1967 తర్వాత డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములకు వెలుపల ఒక నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.
