
రాష్ట్రాల సమగ్ర అభివృద్ధే మోడీ ప్రభుత్వ లక్ష్యం:కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వివక్ష లేకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హెచ్ఐసీసీలో రూ. 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2047 నాటికి 'వికసిత భారత్' కల సాకారం చేయడమే కేంద్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణను ప్రస్తావిస్తూ, స్వాతంత్య్రం నుంచి 2014 వరకు రాష్ట్రంలో సుమారు 2,400 కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే గత 11 ఏళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో అదనంగా 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించబడ్డాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తోందని, ప్రస్తుతం కూడా మరిన్ని రహదారులు ఈ నెట్వర్క్లో చేరుతున్నాయని వెల్లడించారు.
రైల్వే స్టేషన్ల ఆధునీకరణ
రైల్వే రంగంలోనూ తెలంగాణలో విశేష పురోగతి కనిపిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణవ్యాప్తంగా ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను నిర్మించడం లేదా పునరాభివృద్ధి చేయడం జరుగుతోంది. స్వాతంత్ర్యానంతరం ఇంత పెద్ద సంఖ్యలో స్టేషన్ల అభివృద్ధి జరగడం ఇదే తొలిసారి. రూ. 720 కోట్లతో అభివృద్ధి చెందుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ ఏడాది చివరి నాటికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అద్భుతంగా ముస్తాబు కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే చర్లపల్లి స్టేషన్ పనులు పూర్తయినట్లు తెలిపారు.
ఇక తెలంగాణలో చేపట్టిన ఇతర ప్రధాన ప్రాజెక్టులను కూడా ఆయన ప్రస్తావించారు. సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్శిటీ, రైల్ కోచ్ తయారీ యూనిట్, ఎయిమ్స్ హాస్పిటల్, రామగుండం ఎరువుల కర్మాగారం వంటి భారీ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయని కిషన్ రెడ్డి కొనియాడారు. ఎన్నికల సమయంలో రాజకీయం ఉండవచ్చు, కానీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధే మా ఏకైక ధ్యేయం. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లేదా డీఎంకే పాలనలో ఉన్న రాష్ట్రాల పట్ల కూడా ప్రధాని వివక్ష చూపరని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని, అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే 'వికసిత భారత్' సాధ్యమని ఆయన తెలిపారు.
