
మళ్లీ మొదలవ్వనున్న నిప్పుల కొలిమి.. మే 12 నుంచి 'హీట్వేవ్ 3.0'
గత నాలుగు రోజులుగా కాస్త చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కనుంది. ఎండల తీవ్రత నుంచి మనకు లభించిన తాత్కాలిక ఉపశమనం ముగిసిందని మే 12 నుంచి రాష్ట్రంలో మూడవ విడత ఉష్ణ తరంగం (హీట్ వేవ్ 3.0) మొదలుకాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఎండలు మునుపటి కంటే ఎక్కువగా ఉండబోతున్నాయని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. అటు హైదరాబాద్ నగరంలో కూడా ఎండలు మండిపోనున్నాయి ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం ఎండ మాత్రమే కాకుండా, ఉక్కపోత కూడా విపరీతంగా పెరగనుంది.
మే 18 నుంచి 22 వరకు అత్యంత కీలకం
నిపుణుల అంచనా ప్రకారం మే 18 నుంచి 22 మధ్య కాలంలో ఎండలు మరింత ముదరనున్నాయి. తూర్పు తెలంగాణలో వడగాల్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మధ్యాహ్నం పూట బయటకు రావడం ప్రమాదకరమని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక రుతుపవనాల విషయానికి వస్తే, అండమాన్ దీవుల్లో మే 15 నాటికి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. మన దగ్గర కూడా అప్పుడప్పుడు చినుకులు పడవచ్చు, కానీ ఈ ఎండల తీవ్రతను తగ్గించే స్థాయిలో అవి ఉండవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి మే నెలాఖరు వరకు భానుడి ప్రతాపం కొనసాగుతుందనే చెప్పాలి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్ డీఎంఏ) హెచ్చరించింది. అయితే నేడు మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని అధికారులు ప్రజలను కోరారు.
