Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Panthagani Anusha
10 మే, 2026

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగనున్న ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడంతో పాటు ప్రతిష్టాత్మకమైన సీఐఐ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల విడుదల పెండింగ్‌లో ఉన్న విభజన హామీల సాధనే ఈ పర్యటన ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది.

హోం మంత్రి, జల్ శక్తి మంత్రులతో సమావేశం

ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. పర్యటనలో భాగంగా తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రాజకీయ, పరిపాలనా పరమైన అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటల్ తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదల రాష్ట్రంలోని ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు కేంద్ర సహాయంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యం, భవిష్యత్తు పెట్టుబడులపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించే బిజినెస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. పారిశ్రామిక దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించనున్న ఆయన ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు. . సీఎం వెంట మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయిప్రసాద్ సహా పలువురు అధికారులు వెళ్తున్నారు.

పర్యటన చివరిలో నీతి ఆయోగ్ సభ్యులతో పాటు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్ర దేవ్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వ్యూహాలు విధానపరమైన నిర్ణయాలపై వీరు చర్చించనున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ రాష్ట్రానికి గరిష్టంగా ప్రయోజనాలు చేకూర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన సాగనుంది.