
తెలంగాణలో నేటి నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నేటి (సోమవారం) నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘విద్యా వారోత్సవాలు’ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు నాంది పలుకుతూ, హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ రోజు, సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టనున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి, మంత్రులు సందర్శించనున్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో తీసుకొచ్చిన నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల అద్భుత ప్రతిభను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పాఠశాల బ్యాండ్లు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల మార్చ్పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విద్యాశాఖ కార్యదర్శి ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విద్యా వారోత్సవాల లక్ష్యాలపై సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా సంస్కరణలు, మౌలిక వసతుల బలోపేతంపై ప్రభుత్వ దిశానిర్దేశాన్ని వివరించనున్నారు. కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. అలాగే ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన కేజీబీవీ యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయనున్నారు. విద్యా రంగంలో నాణ్యత పెంపు, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
