
ఐదోసారి పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగసామి.. రాష్ట్రపతి నియామకం
పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రిగా ఎన్. రంగసామి నియామకానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎన్. రంగసామి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్ రంగసామిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు.
మే 13న ప్రమాణ స్వీకారం
రంగసామి మే 13న ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఇది ఐదోసారి ముఖ్యమంత్రి పదవి కావడం విశేషం.. పుదుచ్చేరి రాజకీయాల్లో ఆయనకున్న తిరుగులేని ఆధిపత్యానికి ఈ విజయం మరో నిదర్శనంగా నిలిచింది. ఏప్రిల్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) స్పష్టమైన మెజారిటీ సాధించిన నేపథ్యంలో ఈ అధికార మార్పిడి సాఫీగా సాగుతోంది.
మే 4న వెలువడిన ఫలితాల్లో 30 సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయే కి 18 స్థానాలు లభించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూటమికి సులభంగా దక్కింది. ఈ ఎన్నికల్లో అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. మిత్రపక్షాలైన అన్నా డీఎంకే, ఎల్జేకే చెరో ఒక్క స్థానం గెలవడంతో కూటమి బలం మరింత పెరిగింది. అదనంగా అసెంబ్లీలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కూడా ఉండనున్నారు.
ప్రతిపక్షంలో డీఎంకే 5 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. ఇదే సమయంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన టీవీకే రెండు స్థానాలను గెలుచుకుని తన ఉనికిని చాటుకుంది. రంగసామి పునరాగమనంతో పుదుచ్చేరిలో సుస్థిరమైన, కొనసాగింపుతో కూడిన పాలన అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
