
ఇది నాపై జరుగుతున్న 'రాజకీయ కుట్ర':కేంద్ర మంత్రి బండి సంజయ్
తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు 'రాజకీయ కుట్ర'కు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ పోరాటాల్లోకి పిల్లలను, కుటుంబ సభ్యులను లాగడం ప్రత్యర్థుల అసహనానికి, నిరాశకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్ చేశారు.
ఇటీవల నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. నా బహిరంగ జీవితంలో ఎప్పుడూ రాజ్యాంగానికి, చట్టాలకు లోబడే పనిచేశాను. తన రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి మచ్చ లేని జీవితం నాది. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తగా ప్రారంభించి కౌన్సిలర్గా, అనంతరం దశలవారీగా ప్రజల మద్దతుతో అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నేత ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను దృష్టిలో పెట్టుకుని, తనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. ప్రతి కుట్రను బట్టబయలు చేస్తుంది. సత్యమేవ జయతే అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ శనివారం కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఒక మహిళ తన కుమార్తెను ఎరగా ఉపయోగించి బండి భగీరథ్ను హనీట్రాప్లోకి దింపేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అనంతరం భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వేధింపులు, బెదిరింపులు పెరగడంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందిస్తూ, కేసు నిర్వహణలో తెలంగాణ పోలీస్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
