Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
అల్మాస్‌పేట్ జంక్షన్ పేరు వివాదం..సెక్షన్ 144 అమలు

అల్మాస్‌పేట్ జంక్షన్ పేరు వివాదం..సెక్షన్ 144 అమలు

Panthagani Anusha
10 మే, 2026

కడప నగరంలోని అల్మాస్‌పేట్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. ఒక కూడలికి పేరు పెట్టే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి పరస్పరం రాళ్ల దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందుజాగ్రత్త చర్యగా ఆదివారం ఉదయం నుంచి ఆ ప్రాంతంలో సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

వివాద నేపథ్యం

స్థానిక సమాచారం ప్రకారం అల్మాస్‌పేట్ జంక్షన్‌కు ఒక వర్గం వారు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని కోరుతుండగా, మరో వర్గం హనుమంతుడి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ పేరు విషయంలో శనివారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇది కాస్తా ముదిరి నిరసనలు, ధర్నాలకు దారితీసింది. ఆందోళనకారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

అసాంఘిక శక్తుల కుట్ర: కలెక్టర్, ఎస్పీ

ఇక ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ షెల్కే ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఘర్షణలు అత్యంత దురదృష్టకరమని నగరంలో ప్రశాంతతను దెబ్బతీసేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ గొడవను సృష్టించాయని వారు ఆరోపించారు. ఈ వివాదం గత 12 ఏళ్లుగా అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

పుకార్లను నమ్మవద్దు

కాగా ప్రస్తుతం అల్మాస్‌పేట్ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిబంధనలను అతిక్రమించి రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను చూసి ప్రజలు ఆందోళన చెందవద్దని శాంతిభద్రతలను కాపాడటంలో ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు. గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే గుర్తించామని త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.